అతడ్ని తీసుకువచ్చి చంద్రబాబు వాహనం పక్కన నిలుచోబెట్టారు: నారా లోకేశ్

Nara Lokesh reacts over Chandrababu arrest
  • విశాఖలో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి
  • చెప్పులు చూపించిన వ్యక్తిపై అత్యాచార కేసులున్నాయన్న లోకేశ్
  • అధికారులు అనుమతి ఇస్తేనే చంద్రబాబు విశాఖ వెళ్లారని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖలో పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అధికారులు అనుమతి ఇస్తేనే చంద్రబాబు ఉత్తరాంధ్ర వెళ్లారని తెలిపారు. కావాలని చంద్రబాబును ఎయిర్ పోర్టు వెలుపలికి వచ్చిన తర్వాతే అడ్డుకున్నారని ఆరోపించారు.

"వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు చెప్పులు, కోడిగుడ్లు విసిరారు. ఓ వ్యక్తి నల్ల చొక్కా వేసుకుని చెప్పులు చూపించడం మీడియాలో దర్శనమిచ్చింది. అతడిపై మూడు అత్యాచార కేసులున్నాయి. రౌడీ షీట్ కూడా ఉంది. అతడ్ని పోలీసులే తీసుకువచ్చి చంద్రబాబు వాహనం పక్కన నిలుచోబెట్టారు. ఎంతో ప్రశాంతంగా చంద్రబాబు కాన్వాయ్ ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి వస్తే పోలీసుల అండతో వైసీపీ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. ఓ మహిళ తమకు రూ.500 ఇచ్చి తీసుకువచ్చారని చెప్పింది.

ఆయన పర్యటించకూడదన్నది వీళ్ల ఉద్దేశం. మొన్న చంద్రబాబు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తే అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది చూసి ఓర్వలేకే విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నారు. విశాఖను, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది చంద్రబాబే. జగన్ ప్రభుత్వం చేసిందల్లా కంపెనీలను తరిమేయడమే! ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఇప్పుడు జగన్ పక్కనున్న దొంగలు మాట్లాడుతున్నారు... ఈ పది నెలల నుంచి ఏం అభివృద్ధి చేశారు?" అంటూ మండిపడ్డారు. కోడిగుడ్లు, చెప్పులు చూపించడం ట్రయిలర్ అని, అసలు సినిమా అంటే బాంబులు, కత్తులు కటార్లు అని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Chandrababu
Vizag
YSRCP
Police

More Telugu News