దుబ్బాకలో బీజేపీ గెలవకూడదని దాడులు చేశారు: కిషన్ రెడ్డి

kishan reddy fire on
  • దుబ్బాక బీజేపీ అభ్యర్థి మామ ఇంటిపై దాడిచేశారు
  • హైదరాబాద్ లో వారి కుటుంబ సభ్యులను వేధించారు
  • ప్రచారానికి వెళ్తే అడుగడుగునా సోదాల పేరుతో వేధించారు
  • దుబ్బాక ప్రజలు బీజేపీ కార్యకర్తలను కడుపున పెట్టుకున్నారు
దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందర్‌రావు విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ‘దుబ్బాక బీజేపీ అభ్యర్థి మామ ఇంటిపై దాడిచేశారు. హైదరాబాద్ లో వారి కుటుంబ సభ్యులను వేధించారు. బీజేపీ నాయకులు ప్రచారానికి వెళ్తే అడుగడుగునా సోదాల పేరుతో వేధించారు. టీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని కలకలు కంటూ అధికారులు ఆ పార్టీకి సేవలు చేస్తున్నారు. అతిగా ప్రవర్తిస్తున్నారు’ అని చెప్పారు.

‘అయినా దుబ్బాక ప్రజలు బీజేపీ కార్యకర్తలను కడుపున పెట్టుకొని ఆదరించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల తెలంగాణలోని ప్రతి గ్రామంలోనూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్  కోటను దుబ్బాక ప్రజలు బద్దలుకొట్టి రఘునందన్ రావుకు పట్టం కట్టారు. టీఆర్ఎస్ అక్రమాలకు వ్యతిరేకంగా బుద్ధిచెప్పారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.

ప్రజలకు అబద్దాలు చెప్పడంలో తండ్రీ, కొడుకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పోటీపడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.  టీఆర్ఎస్ పార్టీ నేతలు అబద్దాలు ప్రచారం చేయడంలో దిట్టలని, అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.   హైదరాబాద్‌లో పేదలకు లక్ష  ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆరేళ్లు అయినా ఇవ్వకుండా కాలయాపన చేసిందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలు టీఆర్ఎస్‌ను ఓడించి బీజేపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Kishan Reddy
BJP
dubbaka

More Telugu News