మామూలు జలుబు, దగ్గు మాదిరిగానే మారిపోనున్న కరోనా!

Corona Will Change to Nominal Cough and Flu
  • సెప్టెంబర్ నాటికి మూడవ దశ
  • ప్రభావం పిల్లలపై స్వల్పమే
  • ఇప్పటికే చిన్నారుల్లో యాంటీ బాడీలు
  • ఎఫ్టీసీసీఐ వెబినార్ లో నిపుణులు
ఇండియాలో కరోనా మూడవ దశ సెప్టెంబర్ నాటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే దాని ప్రభావం తక్కువగానే ఉంటుందని, మరో సంవత్సరం తరువాత మామూలుగా వచ్చే జలుబు, దగ్గు మాదిరిగానే కరోనా మారిపోతుందని వైద్య నిపుణులు వ్యాఖ్యానించారు.

ఎఫ్టీసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహించిన ఓ వెబినార్ లో పాల్గొన్న నిపుణులు, థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని వస్తున్న విశ్లేషణలు సరికాదని అన్నారు. తొలి రెండు దశల్లో పిల్లలపై చూపిన ఇన్ఫెక్షన్ తో అత్యధిక చిన్నారుల్లో యాంటీ బాడీలు పెరిగాయని, ఇవి థర్డ్ వేవ్ ను అడ్డుకుంటాయని విశ్లేషించారు.

రెండో దశలో కేసుల తీవ్రత పెరగడానికి డెల్టా వేరియంట్ కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన వైరస్ ఒకరి నుంచి ఇద్దరికి వ్యాపించిందని, బ్రిటన్ వైరస్ ఒకరి నుంచి ముగ్గురికి, ఆల్ఫా వైరస్ నలుగురి నుంచి ఐదుగురికి వ్యాపించిందని, ఇప్పుడిక డెల్టా వైరస్ ఏకంగా 5.8 శాతం మందికి వ్యాపిస్తోందని తెలిపారు.

ఇదే వెబినార్ లో పాల్గొన్న ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇంట్లో ఒకరికి కరోనా సోకితే, అందరికీ వైరస్ సోకడానికి ఇదే కారణమని అన్నారు. ఇప్పటివరకూ ఇండియాలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 100 లోపే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

ఇక కరోనాపై గేమ్ చేంజర్ గా, ప్రస్తుతం రూ. 70 వేల వరకూ ఖరీదవుతున్న మోనోక్లోనల్ యాంటీబాడీస్ మందు త్వరలోనే రూ. 10 నుంచి 15 వేలకు అందుబాటులోకి వస్తుందని, ఈ ఔషధం కూడా కరోనా రోగులందరికీ అవసరం లేదని, కేవలం 10 నుంచి 20 శాతం మందికి మాత్రమే ఇది ఇవ్వాల్సి వస్తుందని ఆయన అన్నారు. కరోనా సోకిన తొలి వారం రోజుల వ్యవధిలో ఈ కాక్ టెయిల్ ఇస్తే, 2 నుంచి మూడు రోజుల్లో ప్రభావం తగ్గిపోతుందని, యూఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు ఇదే ఔషధాన్ని వాడారని నాగేశ్వరరెడ్డి గుర్తు చేశారు.
Go Back to Shorts
Corona Virus
Flu
Cough
Webinar

More Telugu News