రేపు, ఎల్లుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు!

TDP to take up protests for two days
  • జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా కారణంగా మరణాలు
  • ప్రభుత్వంపై మండిపడుతున్న విపక్షాలు
  • మార్చి 19, 20 తేదీల్లో నిరసనలకు పిలుపునిచ్చిన టీడీపీ
పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో కల్తీ సారా ఏరులై పారుతోందని... కల్తీ మందు తాగి జనాలు చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. 

ఈ మరణాలపై చర్చించాలని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గత నాలుగైదు రోజులుగా పట్టుబడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. 

జనాల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా, ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్న కల్తీ సారా, మద్యం షాపుల్లో జే-బ్రాండ్ మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మార్చి 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నాయి. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Protest

More Telugu News