జగన్ సీఎంగా కొనసాగితే ఏపీ మరో నైజీరియాలా మారుతుంది: యనమల రామకృష్ణుడు

If Jagan continues as CM AP will become as Nigeria says Yanamala
  • వందలాది వృత్తుల్లోని ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారయిందన్న యనమల
  • మూడున్నరేళ్లలో రూ. 8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారన్న టీడీపీ నేత 
  • అప్పుల్ని బడ్జెట్ లో చూపించడం లేదంటూ విమర్శ 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని చెప్పారు. వ్యవసాయం, వృత్తులు, వ్యాపారాలు అన్నింటినీ సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వందలాది వృత్తుల్లోని ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారయిందని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ అంధకారం కావడం తథ్యమని చెప్పారు. ప్రజలపై భారాలు, నిలిచిపోయిన అభివృద్ధితో నైజీరియా, జింబాంబ్వే కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని అన్నారు. జగన్ సీఎంగా కొనసాగితే ఏపీ మరో నైజీరియాలా మారుతుందని చెప్పారు.

తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వ అప్పులు అసాధారణంగా పెరిగాయని యనమల చెప్పారు. అప్పుల్ని బడ్జెట్ లో చూపించకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూడున్నర సంవత్సరాల్లో రూ. 8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని... అయినా ప్రజల ఆదాయం పెరగలేదు, అభివృద్ధీ జరగలేదని యనమల విమర్శించారు. ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయం ఎటు పోతోందో కూడా లెక్కల్లేవని అన్నారు. ప్రభుత్వం ఎడా పెడా చేస్తున్న అప్పులకు, వచ్చే ఆదాయానికి సంబంధం లేకుండా పోయిందని... ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న అప్పుల కారణంగా ప్రస్తుతం సంవత్సరానికి రూ. 50 వేల కోట్లకు పైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ఆ మొత్తం రూ .లక్ష కోట్లకు చేరే ప్రమాదమూ ఉందని అన్నారు. లక్ష కోట్లు వడ్డీలే చెల్లిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

వైసీపీ ప్రభుత్వం 2021 మార్చి నాటికి చేసిన అప్పులు జీఎస్డీపీలో 44.04 శాతానికి చేరుకున్నాయి. అప్పులు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడమంటే రాష్ట్ర ఆర్ధిక స్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పడమేనని అన్నారు. మూడున్నరేళ్లలో రాష్ట్ర తలసరి అప్పు రూ. 67 వేలకు చేరుకుందని... 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 331 రోజులు అప్పులు చేయాల్సి రావడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు అద్దం పడుతోందని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ వంటి సంస్థల విషయంలో మాట తప్పి మడమ తిప్పి.. ప్రజల్ని మోసం చేశారన్నారు.

ఆదాయం పెంచుకోవడం, సంపద సృష్టించుకోవడం ద్వారానే భవిష్యత్తుకు భరోసా అనే కనీస సిద్ధాంతాన్ని పక్కన పెట్టి.. అప్పులు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. ఇటువంటి విధానాలు రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారబోతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పారు.
Go Back to Shorts
Yanamala
Telugudesam
Jagan
YSRCP

More Telugu News