విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు.. విద్వేషాన్ని ఎలా రెచ్చగొడతాయి?: ఏపీ హైకోర్టు నిలదీత

AP High Court Dismiss Case Against Software Engineer Gopi Krishna
  • గోపీకృష్ణపై 2020 మే 5న పాలకొల్లులో కేసు నమోదు
  • ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ పోస్టులు పెట్టారని అభియోగాలు
  • పోస్టులను పరిశీలించాక కేసును కొట్టివేసిన న్యాయస్థానం
గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన సీహెచ్ గోపీకృష్ణపై ఈ ఏడాది మేలో నమోదైన కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. నిన్న ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టినట్టు ఎలా అవుతుందని పోలీసులను ప్రశ్నిస్తూ గోపీకృష్ణపై నమోదైన కేసును కొట్టివేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా పాలకొల్లు కోర్టులో జరుగుతున్న కేసును రద్దు చేసింది. పిటిషనర్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ఈ మేరకు తీర్పు చెప్పారు. 

కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన గోపీకృష్ణ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ పాలకొల్లుకు చెందిన పసుపులేటి వీరాస్వామి 5 మే 2020న గోపీకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ గోపీకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... గోపీకృష్ణ ఫేస్‌బుక్ పోస్టులు సమూహాల మధ్య శత్రుత్వం పెంచేలా లేవని పేర్కొంటూ ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది.
Go Back to Shorts
AP High Court
Software Engineer Gopikrishna
Facebook Posts

More Telugu News