జైస్వాల్ దెబ్బకు ఐపీఎల్ రికార్డు బద్దలు... రాజస్థాన్ ఎంత ఘనంగా గెలిచిందంటే...!

Jaiswal breaks fastest fifty record as RR hammers KKR
  • 13 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన జైస్వాల్
  • 9 వికెట్ల తేడాతో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
  • తొలుత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్ చేసిన కోల్ కతా
  • 13.1 ఓవర్లలోనే ఛేజింగ్ పూర్తి చేసిన రాజస్థాన్
  • జైస్వాల్ 47 బంతుల్లో 98 నాటౌట్
  • 13 ఫోర్లు, 5 సిక్సులలో వీరవిహారం
ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డు బద్దలయింది. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే ఫిఫ్టీ చేసి ఐపీఎల్ లో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జైస్వాల్ మెరుపులతో... కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 150 పరుగుల విజయలక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 13.1 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టపోయి ఛేదించింది. 9 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. 

ఆఖరి బంతికి సిక్స్ కొడితే సెంచరీ పూర్తయ్యే అవకాశం లభించగా, జైస్వాల్ ఫోర్ కొట్టాడు. జైస్వాల్ మొత్తమ్మీద 47 బంతుల్లో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ స్కోరులో 13 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. 

జైస్వాల్ ఊచకోత తొలి ఓవర్ నుంచే ప్రారంభమైంది. కోల్ కతా కెప్టెన్ నితీశ్ రాణా వేసిన తొలి ఓవర్ లో 26 పరుగులు పిండుకున్న జైస్వాల్... ఆ తర్వాత ప్రతి బౌలర్ ను ఉతికారేశాడు. మరో ఎండ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 48 పరుగులు చేశాడు. ఓపెనర్ జోస్ బట్లర్ (0) దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. 

కాగా, ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు గతంలో కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ పేరిట ఉంది. వీరిద్దరూ 14 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించారు. ఇప్పుడు యశస్వి దెబ్బకు రాహుల్, కమిన్స్ ల రికార్డు తెరమరుగైంది.
Go Back to Shorts
Yashaswi Jaiswal
Fastest Fifty
Rajasthan Royals
KKR
IPL

More Telugu News