చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్ వేసేశారు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Chandrababu closed my mouth with plaster says speaker Ayyanna
  • స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విశాఖకు అయ్యన్నపాత్రుడు
  • అక్కడి నుంచి నర్సీపట్నానికి చేరుకున్న స్పీకర్
  • 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ తనను మంత్రిని చేశారన్న అయ్యన్న
  • ఇప్పుడు చంద్రబాబు అత్యున్నత పదవి ఇచ్చి సత్కరించారన్న స్పీకర్
  • ఏది పడితే అది మాట్లాడకుండా బాబు తన నోటికి ప్లాస్టర్ వేశారన్న అయ్యన్న
ఇంతకుముందులా తాను ఏదిపడితే అది మాట్లాడలేనని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నోటికి తాళం వేశారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. సభాపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన నిన్న విశాఖపట్టణం వచ్చారు. అనంతరం అక్కడి నుంచి నర్సీపట్టణం వెళ్లారు.

అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు తనకు రాష్ట్రంలోనే అత్యున్నతమైన స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారని పేర్కొన్నారు. ప్రస్తుతం శాసనసభకు ఎన్నికైన వారిలో 85 మంది కొత్తవారేనని, వారికి సభా మర్యాద, సంప్రదాయాలతోపాటు నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తానని, అవసరం అనుకుంటే సమావేశాలను మరో రెండుమూడు రోజులు పొడిగిస్తామని వివరించారు.

అయ్యన్నపాత్రుడుకు అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేశ్, కూటమి ఎమ్మెల్యేలు, నగరానికి చెందిన పలువురు వ్యాపారులు అయ్యన్నను కలిసి అభినందనలు తెలిపారు. నర్సీపట్టణంలో ఆయనకు పౌరసన్మానం జరిగింది.
Go Back to Shorts
Ayyanna Patrudu
AP Speaker
Chandrababu
NTR

More Telugu News