ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు... ఎప్పటి నుంచి అంటే...!

AP Govt set to implement new registration charges from Feb 1
  • రిజిస్ట్రేషన్ చార్జీలపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు
  • ఫిబ్రవరి 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయన్న మంత్రి అనగాని
  • కొన్ని ప్రాంతాల్లో చార్జీలు పెరుగుతాయి... కొన్ని ప్రాంతాల్లో తగ్గుతాయని వెల్లడి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రిజిస్ట్రేషన్ ధరలపై సమీక్ష జరుగుతుందని వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే, ఏపీ సర్కారు రిజిస్ట్రేషన్ చార్జీలపై కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. 2025 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. 

అయితే, ఎలాంటి ప్రాంతాల్లో ఎంత ధరలు ఉండాలి, ఎక్కడ ధరలు తగ్గించాలి అనే అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. దీనిపై జనవరి 15 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి అనగాని వివరించారు. భూమి రేట్లు పెరిగిన చోట మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయని స్పష్టం చేశారు. గరిష్ఠంగా 20 శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలిపారు. 

గత ప్రభుత్వ హయాంలో సరైన విధంగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల... పలు ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. ఇటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.
Go Back to Shorts
Registration Fee
Lands
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News