పరిపూర్ణానందను వెంటబెట్టుకుని హైదరాబాద్ వస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే!
- నగర బహిష్కరణపై కోర్టులో ఊరట పొందిన పరిపూర్ణానంద
- విజయవాడ నుంచి బయలుదేరిన కాన్వాయ్
- హిందూ ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేశానన్న స్వామి
హైదరాబాద్ పోలీసులు తనను నగరం నుంచి బహిష్కరిస్తే, కోర్టులో పోరాడి ఊరట పొందిన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద, గత రాత్రి కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ ఉదయం ఆయన విజయవాడలో ఆగి కనకదుర్గమ్మను దర్శించుకోగా, హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ దగ్గరుండి ఆయన్ను తీసుకుని వస్తున్నారు. ఈ మధ్యాహ్నం తరువాత ఆయన హైదరాబాద్ చేరనుండగా, శివార్ల నుంచి భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ, వీహెచ్పీ నేతలు ఏర్పాట్లు చేశారు. కాగా, విజయవాడలో మీడియాతో మాట్లాడిన పరిపూర్ణానంద స్వామి, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం తన జీవితాన్ని అంకితం చేశానని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని అన్నారు.