ఒక ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మంచిది కాదు: ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్
- ఇలాంటి తొందరపాటు చర్యలు కరెక్టు కాదు
- యువతను తప్పుదోవ పట్టించినట్టవుతుంది
- జనసేన ఎమ్మెల్యే ముట్టడించిన పీఎస్ ను పరిశీలించిన ఏఎస్ ఖాన్
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ ను జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు నిన్న ముట్టడించిన విషయం తెలిసిందే. జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన ఈ పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాపాక చర్యలపై ఆయన విమర్శలు చేశారు. ఒక ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదని సూచించారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతను తప్పుదోవ పట్టించినట్టవుతుందని, పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయొచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. కేసుకు సంబంధించి ఒకవేళ ఎస్ఐ తప్పు కనుక ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.