పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ

  • వ్యూహాలకు పదును పెడుతున్న బీజేపీ-కాంగ్రెస్
  • 245 మంది సభ్యులలో 123 మంది మద్దతు తెలపాలి
  • చర్చ రాజ్యసభనూ కుదిపివేసే అవకాశం
తీవ్ర చర్చ, వాదోపవాదాల మధ్య లోక్ సభ ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు-2019 బుధవారం రాజ్యసభ ముందుకు రానుండడంతో అటు అధికార బీజేపీ ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా ఏ అవకాశాన్నీ జారవిడుచుకోకూడదని, బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభలో నెగ్గనీయకూడదని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీని కోసం బుధవారం తమ సభ్యులు అందరూ రాజ్యసభ చర్చ, ఓటింగ్ లో పాల్గొనాలని మూడు లైన్లతో కూడిన విప్ ను జారీ చేసింది.  చర్చ సందర్భంగా కూడా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని సభ్యులకు సూచించింది.

మరోవైపు లోక్ సభలో తమకు ఉన్న మెజార్టీతో బిల్లును నెగ్గించుకున్న బీజేపీ రాజ్యసభలో తీవ్ర పోరాటాన్నే సాగించాల్సి వచ్చేలా ఉంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా, బిల్లు గట్టెక్కడానికి 123 మంది సభ్యుల మద్దతు తెలపాలి. ఈ బిల్లును సమర్ధించిన వారు దేశ పునాదులను ధ్వంసం చేసినవారు అవుతారని ఈరోజు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పేర్కొనడంతో రాజ్య సభలోనూ కాంగ్రెస్ వైఖరి స్పష్టమైంది. మిగిలిన పార్టీల వైఖరి రేపు ఓటింగ్ ద్వారా బయటపడనుంది.
Go Back to Shorts
rajyasabha
congress party
bjp party

More Telugu News