మూడు రాజధానులను తర్వాత నిర్మించొచ్చు కానీ, ముందు ఈ వంతెన నిర్మించండి: పవన్ కల్యాణ్

  • కర్నూలు ఓల్డు సిటీ లోన పర్యటించిన  జనసేన అధినేత 
  • జమ్మిచెట్టు ప్రాంతం, జోహరాపురం కాలనీ మధ్య  బ్రిడ్జి పరిశీలన
  • బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంపై స్థానికులను అడిగిన పవన్
రెండేళ్లు అయినా చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.  ఈరోజు ఉదయం కర్నూలు ఓల్డు సిటీ లోని జమ్మిచెట్టు ప్రాంతం, జోహరాపురం కాలనీ మధ్య హంద్రీ నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రజాప్రతినిధి, ప్రస్తుత ప్రజాప్రతినిధి మధ్య  తగాదాల కారణంగా ప్రజలకు ఉపయోగపడే నిర్మాణం నిలిచిపోవడం బాధాకరమని, రెండు, మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యే పనులను కూడా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు కానీ, ముందు జోహరాపురం వంతెన నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు. ఈ వంతెన నిర్మాణానికి కూడా డబ్బులు లేవని కనుక ప్రభుత్వం చెబితే ప్రజలు క్షమించరని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan
Janasena
Kurnool District
tour
Joharpuram Bridge
3 capitals

More Telugu News