ఢిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని పరస్పర అంగీకారానికి వచ్చాం: కేజ్రీవాల్

  • అమిత్ షా నివాసానికి వెళ్లిన ఢిల్లీ సీఎం
  • అనేక అంశాలపై చర్చించినట్టు వెల్లడి
  • షహీన్ బాగ్ అంశం చర్చకు రాలేదన్న కేజ్రీ 
ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సీఎంగా హ్యాట్రిక్ కొట్టిన కేజ్రీవాల్ పదవీప్రమాణం అనంతరం తొలిసారి అమిత్ షా నివాసానికి వెళ్లారు. ఆయనతో ఢిల్లీ పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఈ భేటీపై కేజ్రీవాల్ ట్విట్టర్ లో వెల్లడించారు.

ఢిల్లీ ప్రాంత అభివృద్ధి కోసం పరస్పర అవగాహనతో సమష్టిగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ సమావేశం సంతృప్తికరంగా సాగిందని పేర్కొన్నారు. ఇకపై ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఓ అంగీకారానికి వచ్చామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతకుముందు భేటీ ముగిసిన తర్వాత, అమిత్ షాతో షహీన్ బాగ్ అంశంపై ఏమైనా మాట్లాడారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆ విషయం చర్చకు రాలేదని సమాధానమిచ్చారు.

Arvind Kejriwal
Amit Shah
Delhi
AAP
BJP

More Telugu News