టీడీపీకి మరో భారీ షాక్... శిద్ధా రాఘవరావు కూడా జంప్!

  • ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న శిద్ధా
  • ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో చర్చలు
  • స్పష్టమైన హామీ ఇస్తే వెంటనే వైసీపీలోకి
  • ఇంకా అధికారికంగా వెలువడని ప్రకటన
ఇప్పటికే పలువురు తమ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉండటంతో కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాలో కీలక నేత శిద్ధా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. ఇప్పటికే సీనియర్ వైసీపీ నేతలతో చర్చలు జరిపిన ఆయన, నేడో, రేపో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.

అయితే, ప్రకాశం జిల్లాలో శిద్ధాకు దర్శి, పొదిలి ప్రాంతాల్లో అపారమైన అనుచరగణం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారితే వచ్చే లాభ నష్టాలపై ప్రధాన అనుచరులతో చర్చిస్తున్న శిద్ధా, ఇదే విషయాన్ని వైసీపీ పెద్దలకు చేరవేస్తూ, స్పష్టమైన హామీని కోరుతున్నట్టుగా సమాచారం.

వైసీపీ పెద్దల నుంచి తాను కోరుకుంటున్న హామీలు లభిస్తే, ఆ పార్టీలో చేరేందుకు సమ్మతమేనని ఇప్పటికే ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తన సమకాలీన కర్నూలు నేత కేఈ ప్రభాకర్ కూడా వైసీపీలో చేరేందుకే మొగ్గు చూపుతూ ఉండటంతో, ఇద్దరూ కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారన్న వార్తలూ వస్తున్నాయి. వీటిపై అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది.

కాగా, ఇటీవలి కాలంలో పలువురు టీడీపీ నేతలు, ఆ పార్టీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామసుబ్బారెడ్డి, కరణం వెంకటేశ్, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి నేతలు జగన్ గొడుగు కిందకు చేరిపోయారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలు టీడీపీలో గుబులు పుట్టిస్తున్నాయనడంలో సందేహం లేదు.

Siddha Raghavarao
Prakasam District
YSRCP
KE Prabhakar
Jagan
Telugudesam

More Telugu News