నేను బతికే ఉన్నానంటూ వీడియో పోస్ట్ చేసిన కరోనా బాధితుడు

Corona patient releases video mentioning he is alive
  • మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఘటన
  • ఓ వ్యక్తి చనిపోయాడంటూ హెల్త్ బులెటిన్ లో ప్రకటించిన డాక్టర్లు
  • పేరు, అడ్రస్ పొరపాటు కారణంగా ఇలా జరిగిందన్న అధికారులు
కరోనా కారణంగా ప్రజలంతా ఎంతో ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఎక్కడ, ఎన్ని కేసులు బయటపడతాయో అని బెంబేలెత్తిపోతున్నారు. తమ ప్రాంతాలకు సంబంధించి ఏ వార్త వచ్చినా ఉలిక్కి పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కరోనా కారణంగా ఓ వ్యక్తి మరణించాడని అధికారులు ఈనెల 25న విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. మరుసటి రోజు ఆయన మరణవార్త పత్రికల్లో కూడా వచ్చింది. దీంతో, సదరు బాధితుడు తాను చనిపోలేదని, బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సి వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ ఓ వీడియోను బాధితుడు సోషల్ మీడియాలో విడుదల చేశాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం, తమ తప్పును అధికారులు గ్రహించారు. ఈ సందర్భంగా ఉజ్జయిని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్సుయా గవాలి మాట్లాడుతూ... పేరు, అడ్రస్ లో పొరపాటు కారణంగా ఇది జరిగిందని చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
Go Back to Shorts
Corona Virus
Madhya Pradesh
Video

More Telugu News