సీఎం ఓకే అనడమే తరువాయి... 24 గంటల్లో బస్సులు రోడ్డెక్కుతాయి: పేర్ని నాని

  • లాక్ డౌన్ నిబంధనలను సడలించిన కేంద్రం
  • బస్సులు, ఇతర వాహనాలకు అనుమతి
  • కండక్టర్లు లేకుండా బస్సులు తిప్పేందుకు ఏపీ యోచన
  • ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉందన్న పేర్ని నాని
కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో బస్సులు, ఇతర వాహనాలకు అనుమతులు కూడా ఉన్నాయి. దీనిపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, రాష్ట్రంలో బస్సులు తిప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు సీఎం నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.

కండక్టర్లు లేకుండానే బస్సులు నడిపే ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉందని, దానికి ఆమోదం వస్తే ప్రయోగాత్మకంగా కొన్ని సర్వీసులు నడిపి, క్రమంగా రాష్ట్రమంతటా అమలు చేస్తామని చెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ చార్జీలు పెంచబోమని, నష్టమైనా భరిస్తామని అన్నారు. సీఎం నుంచి స్పష్టత వస్తే 24 గంటల్లో ఆర్టీసీ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి పేర్ని నాని వివరించారు. విజయవాడలోని ఆర్టీసీ పరిపాలన భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

Perni Nani
APSRTC
Buses
Jagan
Lockdown
Corona Virus
Andhra Pradesh

More Telugu News