మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత... కరోనా నెగెటివ్ వచ్చినా కాటేసిన అనారోగ్యం!

  • ఇటీవలే ద్రోణంరాజు శ్రీనివాస్ కు కరోనా
  • విశాఖ పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స
  • కరోనాతో దెబ్బతిన్న ఇతర అవయవాలు
  • కోలుకోలేకపోయిన శ్రీనివాస్
ఉత్తరాంధ్ర రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకగా, విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చేరారు. కొన్నిరోజుల కిందట కరోనా నెగెటివ్ వచ్చినా, ఇతర అనారోగ్యాల నుంచి కోలుకోలేకపోయారు. కరోనా కారణంగా ఇతర అవయవాలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతితో వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రస్తుతం విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (వీఎంఆర్డీయే) చైర్మన్ గా ఉన్నారు. సీనియర్ రాజకీయవేత్త ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడైన శ్రీనివాస్ చాలాకాలం పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విప్ గా వ్యవహరించారు. విశాఖ సౌత్ నియోజవర్గం నుంచి రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే, 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ ఆయనకు టికెట్ ఇచ్చినా టీడీపీ నేత వాసుపల్లి గణేశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. దాంతో ఆయనకు సీఎం జగన్ వీఎండీఆర్ఏ చైర్మన్ పదవి అప్పగించారు.

Dronamraju Srinivas
Death
Illness
Corona Virus
Visakhapatnam
YSRCP

More Telugu News