ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఈ ప్రభుత్వానికే చెల్లింది: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on CM Jagan
  • రైతులకు బేడీలు వేసిన ఎస్పీ, డీఎస్పీని సస్పెండ్ చేయాలి
  • రైతులను వెంటనే విడుదల చేయాలి
  • రాజధానికి భూములు ఇవ్వడమే వారు చేసిన నేరమా?
అమరావతి ప్రాంత దళిత రైతుల చేతికి సంకెళ్లు వేసి బస్సులో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హంతకులను తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారని విపక్షాలు, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం మరో చర్చకు తెరలేపింది. దళితులపై ఎస్సీ కేసు ఎలా నమోదు చేస్తారని పలువురు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ... రైతులకు బేడీలు వేసిన ఎస్పీ, డీఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అత్యుత్సాహంతో పోలీసులు బేడీలు వేశారని డీజీపీ చెపుతున్నారని విమర్శించారు. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని... జరిగిన ఘటనకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు.

దళితుల మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లిందని దుయ్యబట్టారు. రాజధానికి భూములు ఇవ్వడమే రైతులు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో అన్ని వర్గాలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. రైతులను రాజులను చేస్తానన్న జగన్ గత 17 నెలలుగా రైతులను మోసం చేస్తూనే ఉన్నారని చెప్పారు.
Go Back to Shorts
Atchannaidu
Telugudesam
Amaravati
Farmers

More Telugu News