నంద్యాలలో కలకలం రేపుతున్న మరో సెల్ఫీ వీడియో.. ఎమ్మెల్యే శిల్పా రవి వేధిస్తున్నారంటూ బాధితుడి ఆవేదన

  • తమకు రావాల్సిన కాంట్రాక్ట్‌ను మరొకరికి ఇప్పించారని ఆవేదన
  • హైకోర్టుకువెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా ఫలితం లేకపోయిందన్న బాధితుడు
  • ఎమ్మెల్యేను తన తండ్రి తిట్టినట్టు నిరూపించాలని డిమాండ్
కర్నూలు జిల్లా నంద్యాలలో మరో సెల్ఫీ వీడియో బయటకు వచ్చి కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సూరజ్ అనే కాంట్రాక్టర్ రెండు నెలల క్రితం ఎలక్ట్రికల్ వర్క్ కోసం టెండర్ వేశాడు.  అయితే, దానిని రద్దు చేయకుండానే ఆ కాంట్రాక్టును నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్‌రెడ్డి ఒంగోలుకు చెందిన మాధవరావు అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇప్పించినట్టు సూరజ్ ఆ వీడియోలో ఆరోపించాడు. దీంతో తాము హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా ఫలితం లేకపోయిందని, ఎమ్మెల్యే చెప్పిన వారికే అధికారులు ఆ కాంట్రాక్ట్‌ను అప్పగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎమ్మెల్యేను తన తండ్రి తిట్టినట్టు ప్రచారం చేస్తున్నారని, కానీ ఇందులో వాస్తవం లేదని, తిట్టినట్టు నిరూపించాలని సూరజ్ కుమారుడు డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యే చేసిన పనివల్ల తమ కుటుంబం రోడ్డునపడిందని, తమకు చావాలో, బతకాలో అర్థం కావడం లేదని వాపోయాడు. కాగా, పోలీసుల వేధింపులు భరించలేక నంద్యాలకే చెందిన ఓ ఆటో డ్రైవర్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు వారు తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అయింది. ఆ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోకముందే ఈ వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది.

Kurnool District
Nandyal
Selfie video
Andhra Pradesh
Shilpa ravi

More Telugu News