బీహార్‌లో ఎన్డీఏ విజయంపై ఆరోపణలు.. స్పందించి వివరణ ఇచ్చిన ఈసీ

EC on nda victory allegations
  • ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు
  • నితీశ్‌, సుశీల్ మోదీ ఫలితాలను మార్చేలా చేశారని వ్యాఖ్యలు
  • ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టేసిన ఈసీ
  • తమపై ఎలాంటి రాజకీయపరమైన ఒత్తిడి లేదని వ్యాఖ్య
ఎగ్జిట్ పోల్స్ లో మహాకూటమి విజయం సాధిస్తుందని అంచనాలు వెల్లడైనప్పటికీ బీహార్‌లో ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో  పలు సందేహాలు తలెత్తుతున్నాయి.
ఓట్ల కౌంటింగ్‌పై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల అధికారులపై బీహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్ తో పాటు డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ ఒత్తిడి తీసుకొచ్చి ఫలితాలను తమకు అనుకూలంగా మార్చేశారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఆరోపణలు చేశారు.

తమ కూటమికి చెందిన 19 మంది అభ్యర్థులు గెలుస్తున్నట్టు ఈసీ‌ వెబ్‌సైట్‌లోనూ పెట్టారని, అంతలోనే కనీసం 10 మంది అభ్యర్థులు ఓడినట్టు ప్రకటించారని అన్నారు. నిజానికి తమ కూటమి 119 స్థానాల్లో గెలిచిందని నిన్న రాత్రి ఆ జాబితాను ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల అధికారులపై ఆరోపణలు చేయడం గమనార్హం.

గెలిచిన తమ కూటమి అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని తెలిపింది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. 10 మంది అభ్యర్థులు ఓడినట్టు ప్రకటించారన్న తేజస్వీ ఆరోపణలపై ఉమేశ్‌ సిన్హా మాట్లాడుతూ...  ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని రిటర్నింగ్‌ అధికారుల నుంచి సమాచారం రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పారు.

ఈ కారణం వల్లే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఉండే సమాచారానికి, ఈసీ వెబ్‌సైట్‌లో ఉండే డేటాకు మధ్య కాస్త వ్యత్యాసం ఉంటుందన్నారు. అందుకే కొన్ని పార్టీలు పొరబడి ఉంటాయన్నారు. ఫలితాల ప్రకటన విషయంలో తమపై ఎలాంటి రాజకీయపరమైన ఒత్తిడి లేదని తెలిపారు.
Go Back to Shorts
ec
India
bihar

More Telugu News