టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు

  • 2018 నాటి కేసులో నిన్న అరెస్ట్ అయిన బీటెక్ రవి
  • ఈ ఉదయం పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు
  • పోలీసుల తీరుపై మండిపడిన టీడీపీ నేత
2018లో కడప జిల్లా పులివెందులలోని పూల అంగళ్ల వద్ద జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో నిన్న అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు ఈ ఉదయం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు ఆయనను పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా,  న్యాయమూర్తి  ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

2018 నాటి ఘర్షణ కేసులో బీటెక్ రవిని అరెస్ట్ చేసినట్టు చెప్పిన కడప ఎస్పీ అన్బురాజన్.. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులో పలువురు బెయిలుపై ఉండగా, తాజాగా దర్యాప్తు నిమిత్తం బీటెక్ రవిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.

మరోవైపు, పోలీసుల తీరుపై బీటెక్ రవి మండిపడ్డారు. తాను అంతర్జాతీయ నేరస్తుడిని అయినట్టు వెంటాడి మరీ పట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. స్టేషన్‌కు రమ్మంటే తానే వచ్చే వాడినని అన్నారు. 2018లో కేసు  నమోదైతే ఇప్పటి వరకు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. ఎస్సీ అయిన వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Btech Ravi
Kadapa District
TDP
Central Jail
Andhra Pradesh

More Telugu News