మమ్మల్ని రాజకీయంగా వేధిస్తున్నారు: అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి

  • బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్
  • తప్పుడు సెక్షన్ల కింద కేసులు పెట్టారని సోదరుడి ఆరోపణ
  • తమ ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు చేస్తున్నారని వెల్లడి
  • తన సోదరి అరెస్ట్ వెనుక ప్రముఖుల హస్తం ఉందన్న జగత్ విఖ్యాత్
బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందించారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా వేధిస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాదులో కేసులు నమోదైతే ఆళ్లగడ్డలో ఉన్న తమ అనుచరులను వేధిస్తున్నారని వెల్లడించారు.

తన సోదరిపై తప్పుడు సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆరోపించారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఇంతలా భయపెట్టి ఏంసాధించాలనుకుంటున్నారు? అని జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రశ్నించారు. హఫీజ్ పేటలో ఉన్న 25 ఎకరాల భూమి తమదేనని, తమ ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.

ప్రవీణ్, సునీల్ అనే వ్యక్తుల తండ్రి తమ తండ్రి భూమా నాగిరెడ్డికి లాయర్ గా ఉండేవారని, తమ తండ్రి (భూమా నాగిరెడ్డి) చనిపోయిన తర్వాత వారు ఏవీ సుబ్బారెడ్డితో కుమ్మక్కయ్యారని, తమ ఆస్తులను కాజేసేందుకు పన్నాగం వేశారని జగత్ విఖ్యాత్ రెడ్డి వివరించారు. తన సోదరి అఖిలప్రియ అరెస్ట్ వెనుక ఓ ఎంపీ, మరో బడా బిజినెస్ మేన్ ఉన్నారని తెలిపారు. ఈ కేసులో చంద్రహాస్ అనే వ్యక్తి పేరు మీడియాలో వస్తోందని, కానీ అతనికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధంలేదని జగత్ విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు. వారం కిందటే పెళ్లయిన అతడిని పార్టీ మారేలా బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

Bhuma Jagath Vikhyath Reddy
Bhuma Akhila Priya
Kidnap Case
Hafeez Pet
Hyderabad

More Telugu News