కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకున్న కేజ్రీవాల్ సర్కారు!

New Decissions by Delhi Govt on Corona
  • దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులు
  • పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ర్యాండమ్ టెస్టులు
  • బహిరంగ హోలీ, ఇతర వేడుకలపై నిషేధం
దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న వేళ, మహమ్మారి కట్టడికి కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవారికి ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో ర్యాండమ్ టెస్టులు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ కొనసాగుతుండగా, ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

త్వరలో రానున్న హోలీ, షాబ్ - ఈ- బారాత్, నవరాత్రి ఉత్సవాలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు స్పష్టం చేసింది. జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా మార్కెట్లు, మాల్స్ తదితర చోట్ల మాస్క్ లు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది. ప్రైవేటు బస్సులు నిలిపి ఉంచే పలు చోట్ల కూడా ర్యాండమ్ టెస్ట్ లను నిర్వహించనున్నామని, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని వెల్లడించింది.

కాగా, ఢిల్లీ పరిధిలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,101 కరోనా కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 19 తరువాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,000 దాటింది. మంగళవారం నాడు నమోదైన కేసుల్లో 795 కేసులు యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా వేరియంట్లవేనని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Arvind Kejriwal
Corona Virus
New Delhi

More Telugu News