జగన్ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం ఎవరూ చేయవద్దు: స్పీకర్ తమ్మినేని సీతారాం

  • వాలంటీర్ వ్యవస్థ స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది
  • వాలంటీర్లకు కొందరు రాజకీయాలను ఆపాదిస్తున్నారు
  • వాలంటీర్లు మరింత ఉత్సాహంగా పని చేయాలి
ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను యావత్ దేశం ఆసక్తిగా చూస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. దేశ పాలనా వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు. అయితే వాలంటీర్లకు కొందరు రాజకీయాలను ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా వాలంటీర్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదని... వాలంటీర్లకు తాము అండగా ఉంటామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వాలంటీర్లకు సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజల్లో ఒక్క శాతం అసంతృప్తి కూడా ఉండటానికి వీల్లేదని తమ్మినేని అన్నారు. వాలంటీర్లు మరింత ఉత్సాహంగా పని చేయాలని చెప్పారు. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలను మరిచిపోలేమని అన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడుతున్న జగన్ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నాన్ని ఎవరూ చేయవద్దని కోరారు. భవిష్యత్తులో కూడా జగన్ వంటి సీఎం రాలేరనే నినాదంతో పని చేద్దామని చెప్పారు.

Tammineni Sitaram
YSRCP
Volunteer System

More Telugu News