రోడ్ల మరమ్మతులపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు: మంత్రి పెద్దిరెడ్డి

  • ఏపీలో రోడ్ల పరిస్థితిపై విపక్షాల ఆగ్రహం
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ 
  • టెండర్లకు సీఎం ఆదేశించారన్న పెద్దిరెడ్డి
  • వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయన్న శంకరనారాయణ
ఏపీలో రోడ్ల దుస్థితిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారని వెల్లడించారు. అక్టోబరు కల్లా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

టీడీపీ పాలనలో పీఎంజీఎస్ వై కింద 330 కిలోమీటర్లు మాత్రమే రోడ్ల పనులు చేశారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 3,185 కిలోమీటర్ల మేర రోడ్ల పనులకు టెండర్లు పిలిచామని, 970 కిలోమీటర్ల పనులు పూర్తిచేశామని చెప్పుకొచ్చారు. ఏఐబీ ద్వారా 5,238 కిలోమీటర్లకు టెండర్లు పిలిచి 1,816 కిలోమీటర్ల రోడ్లు పనులు పూర్తిచేశామని వివరించారు.

అటు, మరో మంత్రి శంకరనారాయణ స్పందిస్తూ, వర్షాకాలం పూర్తయ్యాక రోడ్ల మరమ్మతులు చేస్తామని వెల్లడించారు. వర్షాలు బాగా పడడం వల్లే రోడ్లు దెబ్బతిన్నాయని వివరణ ఇచ్చారు.

Peddireddi Ramachandra Reddy
Roads
Andhra Pradesh
Opposition Parties

More Telugu News