మమ్మల్ని భారత్‌కు పంపించేయరూ.. బహ్రెయిన్‌లోని తెలుగు కార్మికుల గోడు!

  • బహ్రెయిన్‌కు వలస వెళ్లిన కార్మికులు
  • గ్యాస్ కంపెనీలు విడిచిపెట్టే విషవాయువులు పీల్చుతూ అనారోగ్యం
  • భారత దౌత్య కార్యాలయం కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన
పొట్ట చేత పట్టుకుని బహ్రెయిన్‌కు వెళ్లిన తెలుగు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను తిరిగి స్వదేశం పంపాలంటూ వేడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వారు చెప్పినదాని ప్రకారం.. వారంతా శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బహ్రెయిన్ వలస వెళ్లారు. అక్కడి ఎన్ఎస్‌హెచ్ సంస్థలో ఆరు వేలమందికి పైగా పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్న కంపెనీ చుట్టూ గ్యాస్ కంపెనీలు ఉన్నాయి. అవి విడిచిపెట్టే విషవాయువులు పీల్చుతూ వీరంతా ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో కొందరు మరణించారు కూడా.

తమకు భయంగా ఉందని, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సంస్థ ప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. అంతేకాక, తమను శారీరకంగానూ వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైతే తమకు వేరేచోట పని ఇప్పించాలని, లేదంటే భారత్‌కైనా తమను పంపించి వేయాలని వేడుకుంటున్నారు. తమ బాధలను భారత దౌత్య కార్యాలయం కూడా తమ గురించి పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

India
Andhra Pradesh
Bahrain
Srikakulam District
Vizianagaram

More Telugu News