పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయి.. ఆయన వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

  • పట్టాభి మాట్లాడిన భాష దారుణంగా ఉంది
  • రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలి
  • డ్రగ్స్ కు, ఏపీకి సంబంధం లేదని గతంలోనే చెప్పామన్న డీజీపీ  
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి నిన్న దారుణమైన భాష మాట్లాడారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని... రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని దుర్భాషలాడటం సరికాదని అన్నారు.

పార్టీ కార్యాలయంలో కూర్చొని ఇలాంటి భాషను మాట్లాడటం సరికాదని అన్నారు. ఇలాంటి భాషను ఎవరూ అంగీకరించరని చెప్పారు. పట్టాభి వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. గత కొన్నిరోజులుగా ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని చెప్పారు. చంద్రబాబు తనకు కాల్ చేశారనే విషయం గురించి మాట్లాడుతూ... నిన్న సాయంత్రం తనకు ఒక కాల్ వచ్చిందని... అయితే ఎవరు మాట్లాడుతున్నారో తనకు స్పష్టత లేదని తెలిపారు.

గుజరాత్ లో దొరికిన డ్రగ్స్ కు, ఏపీకి సంబంధం లేదని గతంలోనే స్పష్టం చేశామని డీజీపీ తెలిపారు. అక్కడి నుంచి ఒక్క గ్రాము కూడా ఏపీకి రాలేదని విజయవాడ సీపీ చెప్పారని గుర్తు చేశారు. డగ్స్ పై ఇన్నిసార్లు స్పష్టంగా చెప్పినా... పదేపదే ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

Gautam Sawang
AP DGP
Pattabhi
Telugudesam

More Telugu News