భారత పర్యటనకు విచ్చేస్తున్న పుతిన్.. మోదీతో కీలక భేటీ!

  • డిసెంబర్ 6న ఢిల్లీకి పుతిన్ వచ్చే అవకాశం
  • భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవనున్న పుతిన్
  • పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్న ఇరు దేశాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల తొలి వారంలో భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 6న ఆయన ఢిల్లీకి రానున్నారని సమాచారం. ఇరు దేశాల మధ్య జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండే ఈ పర్యటనలో ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతారు.

ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. రష్యా తయారు చేసిన అత్యాధునిక ఎస్400 డిఫెన్స్ సిస్టమ్స్ మన దేశానికి ఈ ఏడాది చివరికల్లా అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగనుండటం గమనార్హం.

2018లో ఇరు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ వచ్చారు. ఆ సమావేశంలోనే ఇరు దేశాల మధ్య ఎస్400 రక్షణ వ్యవస్థ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఆ తర్వాత పుతిన్ భారత్ కు రానుండటం ఇదే తొలిసారి.

మరో విశేషం ఏమిటంటే... ఈ ఏడాది పుతిన్ చేపట్టిన రెండో విదేశీ పర్యటన ఇదే. ఇంతకు ముందు ఆయన జెనీవా సమావేశానికి వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. కరోనా నేపథ్యంలో ఇటీలీలో జరిగిన జీ20 సమావేశాలకు ఆయన వర్చువల్ గా హాజరయ్యారు.

Vladimir Putin
Russia
President
India
Visit
Narendra Modi
Annual Summit

More Telugu News