బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం... రేపు ఉదయం తీరం దాటే అవకాశం

  • నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం
  • ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర దిశగా పయనం
  • నేడు, రేపు విస్తారంగా వర్షాలు
  • పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతో గాలులు
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రేపు వేకువజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, పుదుచ్చేరి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.

కాగా, వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో గణనీయంగా వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ పేర్కొంది.

Depression
Bay Of Bengal
Tamilnadu
Andhra Pradesh
Rain Alert

More Telugu News