విదేశాల్లో మోదీకి ఉన్న ఇమేజ్ ను దెబ్బతీయాలని అనుకోలేదు: రాకేశ్ టికాయత్

  • మోదీ క్షమాపణ చెప్పాలని రైతులు కోరుకోలేదు
  • రైతుల ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవద్దని మాత్రమే కోరుతున్నాం
  • రైతుల డిమాండ్లను ఢిల్లీ పట్టించుకోవడం లేదు
ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని రైతులెవరూ కోరుకోలేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. విదేశాల్లో మన ప్రధానికి ఉన్న పరపతిని, ఇమేజ్ ను దెబ్బతీయాలనే ఆలోచన రైతులకు లేదని చెప్పారు. అయితే, ఏ నిర్ణయాన్నైనా రైతుల ఆమోదం లేకుండా తీసుకోవద్దని మాత్రమే తాము ప్రధానిని కోరుతున్నామని తెలిపారు.

దేశం కోసం తాము వ్యవసాయం చేస్తున్నామని, ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నామని... అయినప్పటికీ ఢిల్లీ మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకొస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలపై టికాయత్ స్పందిస్తూ... ఈ వ్యాఖ్యలు ప్రధాని మోదీని కూడా అవమానించేలా ఉన్నాయని చెప్పారు.

మరోవైపు తన వ్యాఖ్యలపై నరేంద్ర సింగ్ తోమర్ వివరణ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. వెనక్కి తీసుకున్న వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకొచ్చే అవకాశమే లేదని చెప్పారు.

Rakesh Tikait
Farmers Leader
Narendra Modi
BJP

More Telugu News