తెరుచుకున్న అయ్యప్ప ఆలయం.. తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనం

  • గురువారం సాయంత్రం తెరుచుకున్న ఆలయం
  • జనవరి 19న తిరిగి మూసివేత
  • 14న మకర జ్యోతి దర్శనం
  • నీలక్కల్, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్ బుకింగ్
శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు నిన్న సాయంత్రం తెరుచుకున్నాయి. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. జనవరి 19వ తేదీ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతి రోజూ తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి హరివరాసనం వరకు భక్తులను అనుమతిస్తారు. అనంతరం పది గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్టు అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం (ఏబీఏఎస్ఎస్) ప్రతినిధి అరుణ్ గురుస్వామి తెలిపారు.

రెండేళ్ల తర్వాత తొలిసారి పెద్దపాదం మార్గాన్ని భక్తుల కోసం తెరిచారు. రేపటి నుంచి ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తారు. ఎరుమేలి నుంచి ఉదయం ఐదున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర మధ్య ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తారు. నీలక్కల్, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. భక్తులు తప్పనిసరిగా రెండు డోసులు వేసుకున్నట్టుగా టీకా ధ్రువీకరణ పత్రాన్ని కానీ, కరోనా నెగటివ్‌గా ధ్రువీకరించే ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టును కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. 19న ఆలయాన్ని మూసివేస్తారు.

Sabarimala
Lord Ayyappa
Devotees

More Telugu News