ఏపీలో 'చింతామణి' నాటక ప్రదర్శనపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఆదేశాలు జారీ

Andhra Pradesh government bans Chintamani drama
  • చింతామణి నాటకాన్ని నిషేధించాలని కోరిన ఆర్యవైశ్యులు
  • తమను కించపరిచేలా నాటకం ఉందని ప్రభుత్వానికి తెలిపిన వైనం
  • ఆర్యవైశ్యుల కోరిక మేరకు నాటకాన్ని నిషేధించిన ఏపీ ప్రభుత్వం
ఇరు తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మహాకవి కాళ్లకూరి నారాయణరావు అప్పటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రచించిన ఈ నాటకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితం. ఎన్నో దశాబ్దాలుగా ఈ నాటకం తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా ఈ చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని సంస్కరించే దిశగా కాకుండా వ్యసనాల వైపు మళ్లించేలా నాటకం ఉందని, దీన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ నాటకం తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉందని ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెళ్లారు.

వారి డిమాండ్ మేరకు చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా నాటకాన్ని ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. నాటకాన్ని నిషేధించడంపై ఆర్యవైశ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా... నాటక ప్రియులు పెదవి విరుస్తున్నారు.
Go Back to Shorts
Chintamani
Drama
Ban
Andhra Pradesh
YSRCP

More Telugu News