దౌత్యమార్గాలు ఉన్నాయిగా.. హింసకు ఫుల్‌స్టాప్ పెట్టండి: పుతిన్‌తో మోదీ

  • ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా
  • గత రాత్రి పుతిన్‌తో మాట్లాడిన మోదీ
  • సైనిక చర్య సరికాదన్న మోదీ
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు ఉపక్రమించిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. గత రాత్రి ఆయన ఫోన్‌లో పుతిన్‌తో మాట్లాడుతూ.. హింసకు తక్షణం స్వస్తి చెప్పాలని కోరారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు దౌత్యమార్గాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోకుండా సైనిక చర్యకు దిగడం ఎంతమాత్రమూ సబబు కాదన్నారు.

దీనికి పుతిన్ స్పందిస్తూ.. అసలు ఉక్రెయిన్‌తో గొడవకు గల కారణాలను వివరించారు. రష్యా-నాటో గ్రూపుల మధ్య ఏర్పడిన విభేదాలను చిత్తశుద్ధి, నిజాయతీతో చర్చల ద్వారా పరిష్కరించుకునే వీలుందని, తమ విధానం కూడా అదేనని మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని, వారిని క్షేమంగా భారత్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యమని అన్నారు.

కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను ప్రయత్నిస్తామని నిన్న మోదీ అధ్యక్షతన నిర్వహించిన భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

Russia
Ukraine
War
Vladimir Putin
Narendra Modi

More Telugu News