సీనియర్ సినీ నటుడు 'ముత్యాలముగ్గు' వెంకటేశ్వరరావు మృతి!

  • 'తేనె మనసులు' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేశ్వరరావు
  • 'ముత్యాల ముగ్గు' చిత్రం ద్వారా అందరి ప్రశంసలు అందుకున్న వైనం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు పిసుపాటి వెంటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన... అక్కడే తుదిశ్వాస విడిచారు.

రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఆయన... 1965లో సినీ రంగ ప్రవేశం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'తేనె మనసులు' చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఏడాదే కృష్ణ నటించిన మరో చిత్రం 'కన్నె మనసులు'లో నటించారు. 

దర్శక దిగ్గజం బాపు తెరకెక్కించిన 'ముత్యాల ముగ్గు' చిత్రంలో ఆయన పోషించిన పూజారి పాత్రకు అందరి ప్రశంసలు లభించాయి. ఆ సినిమాతో ఆయన 'ముత్యాలముగ్గు వెంకటేశ్వరరావు'గా మారిపోయారు. తన కెరీర్లో ఆయన పలు చిత్రాల్లో నటించారు. వెంకటేశ్వరరావు, లక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం ఉన్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

P Venkateswar Rao
Tollywood
Dead

More Telugu News