కుటుంబం లేని వ్యక్తి మోదీ... ఆయనకు సెంటిమెంట్లు తెలియవు: ఎర్రబెల్లి

  • హైదరాబాద్ వచ్చిన మోదీ
  • టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు
  • కుటుంబ పాలన అంటూ వ్యాఖ్యలు
  • మోదీ వ్యాఖ్యలకు బదులిచ్చిన ఎర్రబెల్లి
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పర్యటించిన సందర్భంగా టీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. ఓ కుటుంబ పాలనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బలవుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం ఒక్క కుటుంబం కోసమే జరగలేదని అన్నారు. దీనిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. కుటుంబం లేని వ్యక్తి మోదీ అని, ఆయనకు సెంటిమెంట్లు తెలియవని విమర్శించారు. 

మోదీ చరిత్రపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని, మోదీ మాటలు ఆయన పదవికి ఏమాత్రం తగవని అన్నారు. మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగల్చడమే మీ పనా? అంటూ మోదీని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో అవమానకరంగా మాట్లాడారని, తెలంగాణ ప్రజలు నూకలు తినాలని పేర్కొన్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.

మోదీ చెబుతున్న కుటుంబ పాలన బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ ది కుటుంబ పాలన కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కుటుంబం కేసీఆర్ కుటుంబం అని ఎర్రబెల్లి ఉద్ఘాటించారు. జైళ్లకు వెళ్లి, త్యాగాలు చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం అని వివరించారు.

Errabelli
Narendra Modi
CM KCR
Telangana

More Telugu News