కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొడదాం.. తల తెగినా వెనకడుగు వేయను: అమెరికాలో రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on KCR
  • గత కొన్నిరోజులుగా అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి
  • డల్లాస్ లో ఎన్నారైలతో సమావేశం
  • కేసీఆర్ పై పోరాటానికి అందరూ తనతో కలిసి రావాలని పిలుపు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఆత్మగౌరవం, స్వయం పరిపాలన కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామని... ఆ లక్ష్యం కేసీఆర్ పాలనలో నెరవేరడం లేదని చెప్పారు. కేసీఆర్ ఆయన కొడుకు, కూతురు, బిడ్డ, సడ్డకుడి కొడుకు, ఆయన బంధువులు వేల కోట్ల రూపాయలను సంపాదించారని ఆరోపించారు. 

వృద్ధులకు సకాలంలో పెన్షన్లు అందడం లేదని, ఉద్యోగులకు జీతాలు అందడం లేదని విమర్శించారు. జనాలకు అప్పులు, ఆత్మహత్యలే మిగిలాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు తనతో కలిసి రావాలని... తల తెగినా వెనకడుగు వేయబోనని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర పొలిమేరల వరకు తరిమికొడదామని చెప్పారు. ఈ మేరకు అమెరికాలో ఎన్నారైలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అమెరికాలోని డల్లాస్ లో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణను ఇచ్చిన సోనియమ్మకు మన రాష్ట్రాన్ని బహుమతిగా ఇవ్వాలని అన్నారు. తనకు పదవులు, పైసలు కావాలంటే ఏ పార్టీ అయినా ఇస్తుందని... తరతరాలకు కావాల్సినంత పోగు చేసుకోవచ్చని చెప్పారు. అయినా తాను ప్రజల కోసమే పని చేస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
KCR
TRS

More Telugu News