ఉండవల్లి అరుణ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి

  • ఉండవల్లి ఊసరవెల్లి రాజకీయాలు చేయడం మానేయాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెపుతూనే రాజకీయాలు చేస్తారని మండిపాటు
  • కాంగ్రెస్ ను పైకి లేపడంపై దృష్టి సారించాలని హితవు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని పెట్టబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనికి అనుగుణంగానే ఆయన వివిధ రాజకీయ ప్రముఖులతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్ ను ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొన్న కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు మూడు గంటల సేపు వీరి సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా పాల్గొన్నారు. 

మరోవైపు కేసీఆర్ ను కలిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెపుతూనే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారని, వివిధ రాజకీయ నేతలను కలుస్తుంటారని... వీటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అబ్బెబ్బే అదేం లేదండి, ఉత్తినే పిలిస్తే వెళ్లానంటారని ఎద్దేవా చేశారు. ఉండవల్లి ఊసరవెల్లి రాజకీయాలు చేయడం మానేయాలని ఆయన అన్నారు. మీ దృష్టిని బీజేపీ మీద నుంచి మళ్లించి, మీకు రాజకీయ భిక్షను పెట్టిన కాంగ్రెస్ ను పైకి లేపడంపై సారించాలని సూచించారు.

Vishnu Vardhan Reddy
BJP
Undavalli Arun Kumar
KCR
TRS

More Telugu News