ప్రజలనే కాదు.. కేంద్రాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది: యనమల

YSRCP govt is misleading center says Yanamala
  • తప్పుడు లెక్కలు చూపిస్తూ విచ్చలవిడిగా అప్పులు తెస్తోందన్న యనమల 
  • ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్య 
  • కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా తప్పుదోవ పట్టిస్తోందని విమర్శ 
వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం మరుగున పెట్టిందని... తప్పుడు లెక్కలతో ప్రజలతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ రాబడితో సంబంధం లేకుండా, తప్పుడు లెక్కలు చూపిస్తూ విచ్చలవిడిగా అప్పులు తెస్తోందని మండిపడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు తెస్తోందని అన్నారు. వాస్తవాలను చూపించకుండా ఇష్టం వచ్చినట్టు అప్పులు తేవడం రాజ్యంగాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు. 

వివిధ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా జగన్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని యనమల మండిపడ్డారు. కేంద్ర నిధులను ఇష్టానుసారం మళ్లిస్తూ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులను చెల్లించకపోవడం వల్ల రైల్వే పనులు నిలిచిపోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిస్థితిని చూసి పెట్టుబడులు పెట్టడానికి, అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు.
Go Back to Shorts
Yanamala
Telugudesam
YSRCP

More Telugu News