పార్టీ స్థాపించిన అనతికాలంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ నిజమైన హీరో: త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌దేవ్

  • ఆదిలాబాద్ నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తల సమావేశానికి హాజరైన బిప్లవ్‌దేవ్
  • ప్రజాబలంతో ఎదిగిన ఎన్టీఆర్ దేవుడంటూ ప్రశంసలు
  • ఆయనలానే త్రిపురలో తాము కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుగొట్టామని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుపై బీజేపీ నేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బ్లిపవ్‌దేవ్ ప్రశంసలు కురిపించారు. పార్టీని స్థాపించిన అనతికాలంలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ అసలైన హీరో అని అన్నారు. ఆయన దేవుడని కొనియాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అధ్యక్షతన నిన్న ఆదిలాబాద్ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిప్లవ్‌దేవ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. అప్పటి వరకు శాసనసభలో ప్రాతినిధ్యమే లేని స్థితి నుంచి ప్రజాబలంతో ఎదిగిన ఎన్టీఆర్ ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారని అన్నారు. 

ఆయనలానే త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోటను బీజేపీ బద్దలుగొట్టి చరిత్ర సృష్టించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని బిప్లవ్‌దేవ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, బోధ్‌లో జరిగిన సమావేశంలో ప్రకాశ్ జవదేకర్, ఆసిఫాబాద్‌లో డయ్యూడామన్ అధ్యక్షుడు దీపేష్ తండల్, కాగజ్‌నగర్‌లో జరిగిన సమావేశానికి మణిపూర్ బీజేపీ చీఫ్ శారదాదేవి, ముధోల్‌ సమావేశానికి మాజీమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ హాజరయ్యారు.

Adilabad District
Biplab Kumar Deb
BJP
NTR

More Telugu News