విజయ్ మాల్యా కోర్టు ధిక్కార కేసు.. రేపు శిక్షను ఖరారు చేయనున్న సుప్రీంకోర్టు

Supreme Court Order In Vijay Mallya Contempt Case On Monday
  • కోర్టు ఆదేశాలను ధిక్కరించి 40 మిలియన్ డాలర్లను పిల్లల పేర బదిలీ చేసిన మాల్యా
  • ఫిబ్రవరి 10న మాల్యాకు చివరి అవకాశం ఇచ్చిన కోర్టు
  • అయినా వినియోగించుకోని మాల్యా
2017 నాటి కోర్టు ధిక్కరణ కేసులో పరారీలో ఉన్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీం ధర్మాసనం రేపు శిక్ష ఖరారు చేయనుంది. జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియడంతో మార్చి 10న తీర్పును రిజర్వులో పెట్టారు. 

కోర్టు ఆదేశాలను ధిక్కరించి 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరున బదిలీ చేయడం ద్వారా మాల్యా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయస్థానం నిర్ధారించింది. అలాగే, తమ ఎదుట హాజరు కావాలని పలుమార్లు కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న మాల్యాకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది.

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయవాదితో కలిసి రెండు వారాల్లో కోర్టుకు హాజరు కావాలని, లేదంటే కేసుకు తార్కిక ముగింపు తప్పదని హెచ్చరించింది. న్యాయస్థానం ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా మాల్యా వినియోగించుకోకపోవడంతో రేపు శిక్ష విధించనుంది.
Go Back to Shorts
Vijay Mallya
Supreme Court
Contempt Case
Kingfisher

More Telugu News