ప్రధానిని తిట్టిపోయడం ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ కిందకు రాదు: అలహాబాద్ హైకోర్ట్ స్పష్టీకరణ

  • రాజ్యాంగం పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించిందన్న కోర్టు
  • కానీ ఏ పౌరుడినీ దూషించడానికి ఇది వర్తించదన్న ధర్మాసనం
  • పిటిషన్ కొట్టివేస్తూ ఆదేశాలు జారీ
ప్రధానిని, మంత్రులను తిట్టిపోయడం రాజ్యాంగం ప్రకటించిన ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ కు చెందిన ముంతాజ్ మన్సూరి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ మన్సూరి కోర్టును ఆశ్రయించాడు. ఇందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది.

మన్సూరి అభ్యర్థనను తోసిపుచ్చుతూ జస్టిస్ అశ్వని కుమార్ మిశ్రా, జస్టిస్ రాజేంద్ర కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. కానీ అలాంటి హక్కు ఏ పౌరుడిని కానీ, ప్రధాని, మంత్రులను దూషించడానికి, దుర్వినియోగం చేయడానికి వర్తించదు. పిటిషనర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి సహేతుక ఆధారాలు లేవు’’ అని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ ను కొట్టి వేసింది.

Allahabad
High Court
freedom of speech
Prime Minister
abusing

More Telugu News