గతంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా వైసీపీ లేఖ ఇచ్చింది: జీవీఎల్

  • సమైక్యాంధ్ర కోరుకుంటున్నామన్న సజ్జల
  • తెలుగు రాష్ట్రాలు కలిసిపోవాలన్న వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందన్న జీవీఎల్  
  • రెండు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశమే లేదని స్పష్టీకరణ
ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉమ్మడి అంధ్రప్రదేశ్ ను కోరుకుంటున్నామంటూ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. తెలుగు రాష్ట్రాలు కలిసిపోవాలనే వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే, ఆంధ్రాలో తమకు 175 స్థానాలు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం సాగించవచ్చని వైసీపీ కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. 

గతంలో విభజనకు అనుకూలంగా వైసీపీ లేఖ ఇచ్చిన విషయం మర్చిపోరాదని జీవీఎల్ స్పష్టం చేశారు. అప్పుడు లేఖ ఇచ్చి, ఇప్పుడు విభజనకు వ్యతిరేకం అంటూ కొత్త కథలు చెబుతున్నారని మండిపడ్డారు. 

మళ్లీ తెలుగు రాష్ట్రాలు కలిసిపోతాయన్న అనుమానాలు తెలంగాణలో రేకెత్తించడం కోసమే సజ్జల వ్యాఖ్యలు చేసినట్టుగా భావించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. కానీ తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలవవన్న విషయాన్ని గ్రహించాలని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ మధ్య ఉన్న స్నేహాన్ని రాజకీయ సమస్యల పరిష్కారం కోసమే ఉపయోగిస్తున్నట్టుందని జీవీఎల్ విమర్శించారు.

GVL Narasimha Rao
Sajjala Ramakrishna Reddy
Andhra Pradesh
Telangana
BJP
YSRCP

More Telugu News