ఆర్టీసీకి సంక్రాతి కిక్.. 11 రోజుల్లోనే రూ. 165.46 కోట్ల ఆదాయం

TS RTC records rs165 crores of revenue in sankranthi
  • గతేడాదితో పోలిస్తే ఈసారి 62.29 కోట్ల అదనపు రాబడి
  • సాధారణ చార్జీలతోనే సంక్రాంతికి 3923 బస్సుల ఏర్పాటు
  • 71.1 శాతానికి పెరిగిన ఆక్యుపెన్సీ
తెలంగాణ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. తద్వారా సంస్థ రూ.165.46 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.62.29 కోట్లు అదనంగా రెవెన్యూ వచ్చిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈసారి 12 లక్షల మంది అదనంగా ప్రయాణాలు చేశారని వెల్లడించింది. 

సాధారణంగా పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తుంటారు. కానీ, ఈసారి సాధారణ చార్జీలతోనే రద్దీలకు అనుగుణంగా టీఎస్ ఆర్టీసీ 3923 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తిరుగు ప్రయాణానికి ముందస్తుగా టికెట్‌ బుక్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ కూడా కల్పించింది. దాంతో, జనం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపారు. 

సంక్రాంతి సందర్భంగా కేవలం 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్ ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది  గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్‌) 59.17 శాతం కాగా, ఈ సారి అది 71.1 శాతానికి పెరిగింది. ఇంత రెవెన్యూ రావటం వెనుక కార్మికులు, ఉద్యోగులు, అధికారుల కృషి కీలకమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పత్రిక ప్రకటనలో తెలిపారు.
Go Back to Shorts
tsrtc
Telangana
bus
Sankranti
revenue
record

More Telugu News