డాక్టర్ సునీత పోరాటం అద్వితీయం: రఘురామ

  • అవినాశ్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
  • డాక్టర్ సునీతకు హ్యాట్సాఫ్ అంటూ రఘురామ స్పందన
  • మరికొన్ని అరెస్ట్ లు ఖాయమని వ్యాఖ్య 
  • సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని కామెంట్  
వివేకా హత్య కేసులో పలు మార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు కొట్టివేతకు గురికావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నరసాపురం ఎంపీ రఘురామరాజు తనదైన శైలిలో స్పందించారు. 

అవినాశ్ రెడ్డి పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని, ఈ వ్యవహారంలో డాక్టర్ సునీత పోరాటం అద్వితీయం అని కొనియాడారు. డాక్టర్ సునీత మడమతిప్పని నైజానికి హ్యాట్సాఫ్ అంటూ రఘురామ ట్వీట్ చేశారు. 

ఈ కేసులో మరికొన్ని అరెస్ట్ లు ఖాయమని అన్నారు. ఇప్పటికే అరెస్ట్ పై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ లోపు న్యాయవాదులు డబ్బు సంపాదించుకోవడం ఖాయమని, ఎలాగూ కొట్టేస్తారని తెలిసినా, సుప్రీంకోర్టుకు వెళతారని వ్యంగ్యం ప్రదర్శించారు. హైకోర్టు తీర్పు తాలూకు ఆర్డర్ చేతిలో పడగానే, ఈ సాయంత్రం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతాయని రఘురామ అన్నారు.  

ఈ కేసులో విచారణ చేయాలని సుప్రీంకోర్టే హైకోర్టుకు చెప్పినప్పుడు, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే ఏం జరుగుతుందో ఊహించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదేమీ అల్లాటప్పా కేసు కాదని, మర్డర్ కేసు అని, హుటాహుటీన టేకప్ చేయకపోవచ్చని అన్నారు. 

ఈ పిటిషన్లు సోమవారం విచారణకు రావొచ్చని, జగన్ కు చెందిన కేసులు వాదించే వాళ్లే దీంట్లోనూ వాదనలు వినిపిస్తారని, చివరికి న్యాయస్థానం ఆ పిటిషన్లు కొట్టేస్తుందని రఘురామ జోస్యం చెప్పారు. ఈ విషయం చెప్పడానికి న్యాయనిపుణుల అంచనా అక్కర్లేదని, తన అంచనా సరిపోతుందని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ త్వరగా జరపాలని సుప్రీం కోర్టు చెబితే, విచారణ ఆపాలంటూ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళాతారా? అంటూ ప్రశ్నించారు.

Raghu Rama Krishna Raju
Dr Suneetha
YS Vivekananda Reddy
Avinash Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News