హత్యకు దారితీసిన సినీ అభిమానం

  • పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఘటన
  • ప్రభాస్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న అభిమాని
  • దానిని తీసేసి పవన్ వీడియో పెట్టుకోవాలన్న స్నేహితుడు
  • మాటామాటా పెరగడంతో హత్య 
సినిమా హీరోలపై పెంచుకున్న అభిమానం స్నేహితుల మధ్య గొడవకు కారణమైంది. ఆపై హత్యకు దారితీసింది. ఆ హీరో వీడియోలను తీసేసి తాను అభిమానించే హీరో వీడియోలను స్టేటస్‌గా పెట్టుకోవాలన్నందుకు స్నేహితుడిని కొట్టి చంపాడు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్‌లు భవనాలకు రంగులు వేస్తుంటారు. మూడు రోజుల క్రితం అదే పనిపై అత్తిలి వచ్చారు. మసీదు వీధిలోని ఓ భవనానికి రంగులు వేస్తూ అదే భవనంపై నిద్రిస్తున్నారు. 

నటుడు ప్రభాస్ అభిమాని అయిన హరికుమార్ ఏలూరులో ప్రభాస్ అభిమానుల సంఘానికి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన వాట్సాప్ స్టేటస్‌గా ప్రభాస్ వీడియోను పెట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ అభిమాని అయిన కిషోర్ అది చూసి ప్రభాస్ వీడియోలు కాకుండా పవన్ వీడియోలు పెట్టుకోవాలని సూచించారు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. 

అప్పటికే ఇద్దరూ మద్యం మత్తులో ఉండడంతో మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన హరికుమార్ సెంట్రింగ్ కర్రతో కిషోర్ తలపై దాడిచేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న రాయితో ముఖంపై మోదడంతో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరికుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

West Godavari District
Attili
Pawan Kalyan
Prabhas
Crime News

More Telugu News