సిగ్నల్ వ్యవస్థ వైఫల్యం.. రైలు ప్రమాద దుర్ఘటనపై విపక్షాల విమర్శల దాడి

  • ఇన్ని రైళ్లు ఒకేసారి ప్రమాదానికి గురి కావడంపై ఆందోళన
  • కవచ్ వ్యవస్థ ఎందుకు కాపాడలేకపోయిందని ప్రశ్న
  • కేంద్రం పేదల రైళ్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు
ఒడిశాలో మూడు రైళ్లు పట్టాలు తప్పిన ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థ వైఫల్యం కారణమంటూ ప్రతిపక్షాలు తమ విమర్శల దాడి మొదలు పెట్టాయి. పలు పార్టీల నేతలు ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే స్పందిస్తూ.. ‘‘సిగ్నల్ వ్యవస్థ వైఫల్యం వల్లే మూడు రైళ్లు ఢీకొన్నాయనడం నమ్మశక్యం కాకుండా ఉంది. తీవ్రమైన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది’’ అని అన్నారు. 

సీపీఐ నేత బినోయ్ విశ్వమ్ స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం కేవలం విలాసవంత రైళ్లపైనే దృష్టి పెడుతోంది. సామాన్యులు ప్రయాణించే రైళ్లు, ట్రాక్ లను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒడిశా మరణాలు దీని ఫలితమే. రైల్వే మంత్రి రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఫ్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి సైతం స్పందించారు. ‘‘విషాదకరం, చాలా సిగ్గుచేటు. నేటి కాలంలో మూడు రైళ్లు ఎలా ఢీకొన్నాయి? ఎవరు సమాధానం చెబుతారు? బాధిత కుటుంబాలు అందరి కోసం ప్రార్థిస్తున్నా’’ అని పేర్కొన్నారు. 

రాజకీయ విశ్లేషకుడు తెహ్ సీన్ పూనావాలా రైల్వే శాఖ చెబుతున్న కవచ్ వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎలుగెత్తి చూపారు. ‘‘గౌరవనీయ రైల్వే మంత్రి కవచ్ గురించి తరచూ మాట్లాడుతుంటారు. దీన్ని యూరప్ లో మాదిరి మెరుగైన వ్యవస్థగా, ప్రమాదాలను నివారిస్తుందని చెబుతుంటారు. కానీ, ఇక్కడ ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు రైళ్లు ఢీకొన్నాయి’’ అని పేర్కొన్నారు.

signalling failure
Opposition attack
odisa rail accident
train tragedy

More Telugu News