అల్లకల్లోలంగా అరేబియా సముద్రం.. దేవభూమి ద్వారకలో ఆలయం మూసివేత

  • ముంచుకొస్తున్న బిపర్ జోయ్ తుపాను
  • తీరం వద్ద ఎగసిపడుతున్న రాకాసి అలలు
  • సాయంత్రం 4 - 8 గంటల మధ్య తీరాన్ని తాకనున్న తుపాను
 పశ్చిమ తీర రాష్ట్రాలపై విరుచుకుపడేందుకు బిపర్ జోయ్ తుపాను వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. ఈ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య తీవ్ర తుపాను తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమయింది. తుపాను కారణంగా అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు తీరం వద్ద ఎగసిపడుతున్నాయి. 

ఇప్పటికే తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, జునాగఢ్, మోర్బీ, రాజ్ కోట్, ఉత్తర గుజరాత్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా గాలు వీస్తున్నాయని తెలిపింది. మరోవైపు తుపాను కారణంగా దేవభూమి ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని మూసివేశారు. దేవాలయంలోకి భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మరోవైపు విపత్తును ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, కోస్ట్ గార్డ్ బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


Bipar Joy
Cyclone
Gujarat
Dwaraka Temple

More Telugu News