టాస్ గెలిచాక రోహిత్ శర్మ ఏమన్నాడంటే...!

  • వరల్డ్ కప్ లో నేడు దాయాదుల సమరం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • రాత్రివేళ మంచును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్న రోహిత్
  • ఇషాన్ కిషన్ పరిస్థితి పట్ల బాధపడుతున్నామని వెల్లడి
  • కానీ గిల్ కోసం కిషన్ ను తప్పించాల్సి వచ్చిందని వివరణ
వరల్డ్ కప్ లో ఫైనల్ ను మించిన మ్యాచ్ కు ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టేడియం క్రిక్కిరిసిపోయిన విధానమే ఆ విషయం చెబుతుంది. కాగా, టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. 

టాస్ సందర్భంగా రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాస్ గెలవడం అమితానందాన్ని కలిగించిందని తెలిపాడు. స్టేడియంలో అద్భుతమైన వాతావరణం కనిపిస్తోందని పేర్కొన్నాడు. 

"మేం నిజంగా అసాధారణమైన అనుభూతి పొందబోతున్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పిచ్ బాగుంది... మ్యాచ్ కొనసాగేకొద్దీ పిచ్ మార్పు చెందేట్టుగా ఏమీ కనిపించడంలేదు. అయితే రాత్రివేళ మంచు కీలకంగా మారే అవకాశం ఉంది. దీన్ని కూడా మేం దృష్టిలో ఉంచుకుని మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.

ఏదేమైనా మా అత్యున్నత స్థాయి ఆటను ప్రదర్శించడానికి తహతహలాడుతున్నాం. ప్రతి మ్యాచ్ లోనూ మేం ఇలాగే ఆడాలని కోరుకుంటాం. అయితే, ఇలాంటి భారీ టోర్నమెంట్ లో ఆడుతున్నప్పుడు జట్టులో ప్రశాంత వాతావరణం ఉండడం చాలా ముఖ్యం. 

ఇక, ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్ మాన్ గిల్ జట్టులోకి తిరిగొచ్చాడు. ఇషాన్ కిషన్ ను జట్టు నుంచి తప్పించడానికి బాధపడుతున్నాం. జట్టుకు అవసరమైన సమయాల్లో ఇషాన్ తనవంతు పాత్రను సమర్థంగా పోషించాడు. గత ఏడాదిగా గిల్ మాకు ప్రత్యేకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఇలాంటి మైదానంలో అతడు జట్టులో ఉండాలని కోరుకున్నాం" అని రోహిత్ శర్మ వివరించాడు.

Rohit Sharma
Comments
Toss
Team India
Pakistan
World Cup

More Telugu News