ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఫిర్యాదు

  • గవర్నర్‌ను కలిసిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం ప్రతినిధి నిమ్మగడ్డ రమేశ్
  • ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని విజ్ఞప్తి 
  • రాజ్యాంగబద్ధ పాలన సాగేలా చూడటం గవర్నర్ బాధ్యతని మీడియాతో వ్యాఖ్య
ప్రభుత్వ నిధులు పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం అనైతికమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం ప్రతినిధి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సంస్థ ఇతర ప్రతినిధులతో కలిసి ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘ప్రభుత్వం.. పార్టీ, రెండూ సమాంతర వ్యవస్థలు, ప్రభుత్వంపై పార్టీ ప్రభావం పడకూడదు. ప్రభుత్వ వనరులతో, ప్రభుత్వ సిబ్బందితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం అనైతికం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇటీవల జారీ చేసిన జీవో నెం.7 ద్వారా పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కలిపే నిర్వహిస్తున్నారు. ఎన్నికలు, సమీపిస్తున్న తరుణంలో వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. అందుకే ఆయన్ను కలిసి రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చూడాలని ఫిర్యాదు చేశాం. పారదర్శకమైన పాలన జరగాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆశిస్తోంది’’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. 

ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం కూడా అనైతికమని ఆయన స్పష్టం చేశారు. ఓట్లు తొలగించేటప్పుడు సంబంధిత వ్యక్తికి ముందుగా నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలన్నారు. పౌరుడు ఎన్నిక చేసుకున్న ప్రదేశంలోనే ఓటు హక్కు కల్పించాలని, నివాసం లేనంత మాత్రాన ఓటు హక్కు తొలగించకూడదని అభిప్రాయపడ్డారు. కేవలం బీఎల్వోల ఫిర్యాదు మేరకు ఓటు హక్కు తొలగిస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు.

Nimmagadda Ramesh Kumar
Governor
Andhra Pradesh
YS Jagan
YSRCP

More Telugu News